
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు నిలకడగా పెరుగుతున్నా దృష్ట్యా ఈ ఫోన్ కాల్ ఆసక్తి రేపుతుంధీ. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ ఎల్లుండి ముగియనుండటంతో దీన్ని కొనసాగించాలా..? వద్దా..? అనేదానిపై రెండ్రోజులుగా కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్ చేసి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్కు కాల్ చేసి రాష్ట్రాల్లో పరిస్థితులు, కరోనా కట్టడికి అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. అదే విధంగా మినహాయింపులు పెరిగాక కేసులు ఉధృతం కావడంపైనా అమిత్ షా ఆరా తీశారు. ఈ సందర్భంగా మినహాయింపులతో పాటు పలు విషయాలను జగన్.. షా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. నెలాఖరుతో లాక్డౌన్ ముగిశాక ఎలాంటి విధానాలు ఉంటే బాగుంటుందన్న అంశాలపైనా ముఖ్యమంత్రులతో అమిత్ షా సంప్రదింపులు జరుపుతున్నారు.
ప్రధాన నగరాల్లో అనుసరించాల్సిన విధానాలు.. రాష్ట్రాల వారీగా ప్రత్యేక మినహాయింపులు ఏమైనా కావాలా అనే అంశాలపై కేంద్ర మంత్రి దృష్టి సారించారు. లాక్డౌన్ ఉపసంహరణ విధివిధానాలపై ప్రధాని మోదీతో సమావేశం తర్వాత సీఎంలకు అమిత్ షా ఫోన్ చేయడం ప్రారంభించారు.